హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి శుక్రవారం యాదాద్రిలో ప్రభుత్వ-ప్రైవేట్-పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించారు.
ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు గ్రామీణ,సెమీ-అర్బన్ ప్రాంతాలలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిస్థితుల్లో PPP మోడల్ ఆచరణీయమైనదని రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. ‘పీపీపీ’ మోడల్లో అధికారికంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2022 నుండి PPP మోడల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించేందుకు సరఫరాదారులు, తయారీదారులతో కలిసి పని చేస్తోంది.
మరోవంక గ్రేటర్ వ్యాప్తంగా త్వరలో 200 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఎస్ రెడ్కో(TSREDCO) చర్యలు తీసుకుంటోంది. మూడు నెలలుగా పెద్దసంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి రావటంతో కొత్త చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో టీఎస్ రెడ్కో వేగం పెంచింది. సెప్టెంబర్ నాటికి 100 స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్కు సరిపోయేలా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్ రెడ్కో) ఉన్నతాధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ, యూనివర్సిటీలు, హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయాలతో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. టీఎస్ రెడ్కో 60 కిలోవాట్స్ సామర్ధ్యంతో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తోంది. ఒక్కో వాహనం (కారు) 30 నిమిషాల్లో చార్జింగ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.