హైదరాబాద్: విద్యార్ధులకు విద్యను ఆహ్లాదకరంగా, ఇంటరాక్టివ్గా మార్చడానికి రాష్ట్రప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. సర్కారు బడుల్లో స్మార్ట్ క్లాస్రూమ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.
పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వర్చువల్ రియాలిటీ (VR) ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి విద్యా శాఖ సిద్ధమైంది. ఈ ల్యాబ్లు విద్యార్థులకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాలను అందిస్తాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ప్రయోగాత్మకంగా మొదట ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ప్రారంభించనున్నారు. ప్రతి పాఠశాలలోని ల్యాబ్లో 20 VR హెడ్సెట్లు లేదా హెడ్గేర్లు, 20 బీన్ బ్యాగ్లు, ఒక్కో టాబ్లెట్, స్టోరేజ్ కేస్, 1 KVA UPS ఉంటాయి. ఈ ల్యాబ్లు V నుండి X వరకు తరగతులకు సాధారణ శాస్త్రం, గణితం, జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలను బోధించడానికి, నేర్చుకోవడానికి ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు జీవశాస్త్ర పాఠాలను వివరించడానికి ఉపాధ్యాయులు బ్లాక్బోర్డ్పై రేఖాచిత్రం గీయాలి. వచ్చే విద్యా సంవత్సరం నుండి వర్చువల్ రియాలిటీ ద్వారా విద్యార్థులు ఇంటరాక్టివ్, 3D/5D మోడ్లో పాఠాలు నేర్చుకోనున్నారు. VR హెడ్గేర్ రాష్ట్ర పాఠ్యాంశాలకు మ్యాప్ చేయబడిన కంటెంట్తో లోడ్ చేశారు. VR పరికరాలు విద్యార్థులకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాలను అందిస్తాయని ఒక అధికారి తెలిపారు. వీఆర్ ల్యాబ్ల ఏర్పాటు కోసం, టెండరింగ్ ప్రక్రియ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ను ఎంపిక చేసేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ను డిపార్ట్మెంట్ నియమించిందని ఆయన తెలిపారు.