హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే బయో ఆసియా గ్లోబల్ సదస్సు ఫిబ్రవరి 24,25 తేదీల్లో నిర్వహించనున్నారు.రెండు రోజుల పాటు జరగనున్న బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అతిపెద్ద సదస్సు బయోఆసియా-19వ ఎడిషన్కు 70కు పైగా దేశాల నుంచి 30వేల మంది లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొననున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి వర్చువల్ విధానంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ‘ఫ్యూచర్ రెడీ’ థీమ్తో నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రభుత్వం, ఇండస్ట్రీ, అకాడమీయా నుంచి లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో లైఫ్ సైన్సెస్ రంగ ప్రస్తుత గమనం, సవాళ్లు, భవిష్యత్తులోవృద్ధి అవకాశాలపై తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు హబ్గా ఎదుగుతోన్న హైదరాబాద్ నగర జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు కీలకపాత్ర పోషిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ సత్తా చాటేందుకు ఇదొక చక్కని వేదిక అని పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సు నిర్వహణలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్,నోవార్టిస్,అరబిందోఫార్మా, హెటిరో, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు పాల్గొంటున్నాయి. వీటితో పాటు జీవశాస్త్రాల పరిశ్రమలోని భారత్ బయోటెక్, జీవీకే, ఫెర్రింగ్, సైటివా వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. బయోటెక్ స్టార్టప్లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్సైన్సెస్ రంగానికి సంబంధించిన అంశాలపై లోతుగా విశ్లేషిస్తారు. నోబెల్ గ్రహీతలు డాక్టర్ కుర్ట్ వుత్రిజ్, అడా యోనత్, హరాల్డ్ జుర్ హుస్సేన్, బారీ మార్షల్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటి రామారావు
మాట్లాడుతూ “ఔషధ, జీవశాస్త్రాల రంగాలకు ప్రపంచస్థాయి కేంద్రం (హబ్)గా, టీకాల
రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని అన్నారు. వైద్యఆరోగ్య సంరక్షణలో
భారతదేశంతో పాటు ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. తెలంగాణ జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు అమూల్యపాత్ర పోషిస్తోంది. గత 18 ఏళ్లలో బయో ఆసియా సదస్సు ద్వారా రూ. 19,400 కోట్ల విలువైన 270 పైగా ఒప్పందాలు జరిగాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఈ సదస్సులో ప్రసిద్ధ నిపుణులు తమ పరిశోధనలను ఆవిష్కరించనున్నారు. కరోనా అనుభవాల నేపథ్యంలో ఇది కొత్త పరిష్కారాలను చూపుతుంది. నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది అవుతుంది. జీవశాస్త్రాల రంగాల ప్రస్తుత గమనం, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై చర్చాగోష్ఠులు జరగనున్నాయి. కరోనా విసిరిన సవాళ్లు.. ఆరోగ్య పరిరక్షణలో సాంకేతిక అవకాశాలు,టీకాలలో భారత్ పాత్ర వంటి అంశాలపై చర్చిస్తాం. సదస్సుకు అన్ని దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తాం” అని కేటీఆర్ తెలిపారు.