హైదరాబాద్: గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభించి 24 గంటలైనా గడవకముందే ఆది, సోమవారాల్లో రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ బోర్డులను చింపి, పార్టీ జెండాలను తొలగించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.
ఆదివారం ఉదయం 11.35 గంటలకు గుంటూరులోని మంగళగిరి రోడ్డులోని ఏఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఐదంతస్తుల భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ ఆచితూచి మాట్లాడారు. కేవలం కేసీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావించి.. ఆయనకు పీఎం అయ్యే యోగ్యత ఉందని చెప్పారే.. తప్ప ఏపీలోని ప్రధాన పార్టీలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయినప్పటికీ దుండగులు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి లభిస్తున్న స్పందనను జీర్ణించుకోలేక ప్రత్యర్థి పార్టీల సభ్యులు ఇలాంటి దాడికి పాల్పడి ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఆంధ్రాలో వచ్చే ఎన్నికలకు సిద్దం అయ్యేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈవారం నుంచి పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయి. ఈ భవనంలో మొదటి అంతస్తులో పార్టీ కార్యకర్తలతో సమావేశాల కోసం సమావేశ మందిరం, రెండు, మూడో అంతస్తుల్లో పరిపాలన కార్యాలయాలు ఉన్నాయి. అతిథి గది, సమావేశ మందిరం, వ్యక్తిగత కార్యాలయంతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని కార్యాలయం ఐదవ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ నేతల కోసం దాదాపు 16 అతిథి గదులు కూడా ఉన్నాయి.
ఏపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలి వంటి ప్రణాళికలు ఇక్కడి నుంచే జరగనున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ నెక్ట్స్ మధ్యప్రదేశ్లో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో దూకుడుగా పార్టీ కార్యాలయం సిద్ధం చేసింది.
వచ్చే ఏడాది అసెంబ్లీతో పాటు పార్లమెంట్కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలాన్ని పెంచుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మెంబర్షిప్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభించనున్నారు.