హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ) సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన ‘వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్- 023’లో.. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ (ఇంజినీరింగ్ ప్రగతికి సుస్థిర ప్రతీక)’గా గుర్తించి అవార్డుతో ఏఎస్సీఈ సత్కరించింది.
ఈ సందర్భంగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఏఎస్సీఈ) ప్రెసిడెంట్ మారియా సీ లెమాన్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోగలదని ఏఎస్సీఈ ప్రెసిడెంట్ మారియా సీ లెమాన్ అన్నారు.
ASCE మరియు ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (ASCE-EWRI) అధ్యక్షురాలిగా ఎన్నికైన షిర్లీ క్లార్క్ కాళేశ్వరాన్ని ‘మనసుని కదిలించే అద్భుతమైన ప్రాజెక్ట్’ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ వాసుల జీవన ప్రమాణాలను పెంచిందని ఆమె అన్నారు. “ఒక హైడ్రాలిక్ ఇంజనీర్గా, నీటిని 500 మీటర్ల ఎత్తులో ఎత్తిపోయడం మైండ్ బ్లోయింగ్” అని క్లార్క్ చెప్పారు.
ASCE-EWRI డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్ మాట్లాడుతూ కాళేశ్వరం విజయానికి ప్రాజెక్ట్తో ముడిపడి ఉన్న సామాజిక అంశాలు అదనపు చెక్మార్క్ అని అన్నారు.
“అందుబాటులో ఉన్న వనరులను ఆప్టిమైజ్ చేయడం ప్రపంచ సవాలు. దీన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపించింది. ఇది ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా ఉంటుంది” అని పార్సన్స్ చెప్పారు.
ఈ సదస్సుకు హాజరైన మంత్రి కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై అద్భుతమైన ప్రసంగం చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కరువును తరిమేసిన విధానాన్ని, నదినే ఎత్తిపోసిన విధానాన్ని వివరిస్తుంటే సభికులు చప్పట్లతో స్వాగతించారు.