హైదరాబాద్: ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సు టికెట్తో పాటు స్నాక్ బాక్స్ను అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఇప్పటికే ఎయిర్ కండిషన్డ్ బస్సు సర్వీసుల్లో వాటర్ బాటిల్ అందిస్తున్న కార్పొరేషన్ తాజాగా స్నాక్ బాక్స్ లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్-విజయవాడ రూట్లో నడిచే తొమ్మిది ఎలక్ట్రిక్ ‘ఇ-గరుడ’ బస్సుల్లో స్నాక్ బాక్స్ సిస్టమ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగిలిన లాంగ్ జర్నీ సర్వీసుల్లో కూడా అమలు చేస్తామని సంస్థ చెబుతోంది.
స్నాక్ బాక్స్లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కీ ప్యాకెట్తో పాటు మౌత్ ఫ్రెష్నర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్బాక్స్ కోసం టికెట్ రేట్లోనే రూ.30 నామ మాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం బస్సులో సిబ్బందికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ప్రతీ స్నాక్ బాక్స్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని ఫోన్లో స్కాన్ చేసి.. స్నాక్ బాక్స్ విధానంపై, అందులో ఆహారంపై సంస్థకు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఈ ఫీడ్ బ్యాక్ను పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పలు చేస్తామని సంస్థ యాజమాన్యం తెలిపింది. మిగిలిన బస్సుల్లో కూడా విస్తరించేందుకు ఈ ఫీడ్ బ్యాక్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే 'స్నాక్ బాక్స్'ను ఇవ్వాలని #TSRTC సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్-విజయవాడ… pic.twitter.com/d2Yp5c3I7e
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 26, 2023