హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ నూతన విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంలో మార్పులు తీసుకువస్తోంది. మిడ్-డే మీల్ మెనూని మరింత ప్రోటీన్ కంటెంట్తో పిల్లలకు అందించనుంది.
మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. అంతేకాదు ప్రతి సోమవారం విద్యార్థులకు అందించే మెనూలో బియ్యం, పప్పుతో తయారుచేసిన ‘ఖిచ్డీ’, ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
సవరించిన మెను ప్రకారం.. ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే గుడ్లను ప్రత్యామ్నాయ రోజులలో విద్యార్థులకు ఇస్తారు. గతంలో మధ్యాహ్న పథకంలో రోజు విడిచి రోజు పప్పును అందించేవారు. పోషకాహారంలో భాగంగా ఇకపై ప్రతిరోజు పప్పును భోజనంలో వడ్డిస్తారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన మెనూని సవరించింది. జూన్ 12 నుండి సవరించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ గురువారం అన్ని మండల విద్యాశాఖాధికారులు,ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. అలాగే ఆహార పంపిణీలో పరిశుభ్రత పాటించాలని వారిని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 28,606 బడుల్లోని 25,26,907 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు.
సవరించిన మధ్యాహ్న భోజన మెనూ…
- సోమవారం: ఖిచ్డీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మరియు గుడ్డు
- మంగళవారం: అన్నం, సాంబార్ మరియు మిశ్రమ కూరగాయల కూర
- బుధవారం: అన్నం, ఆకుకూరల పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, గుడ్డు
- గురువారం: వెజిటబుల్ బిర్యానీ మరియు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ
- శుక్రవారం: అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మరియు గుడ్డు
- శనివారం: అన్నం, ఆకుకూరల పప్పు మరియు మిశ్రమ కూరగాయల కూర