హైదరాబాద్: అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జూన్ 9వ తేదీ ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు.
చేపమందు కోసం మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీని బట్టి, ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేతలు చేపడుతామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అదనపు సీపీ సూచించారు.
- ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనాలను, అబిడ్స్ జీపీఓ- నాంపల్లి స్టేషన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
- ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలస్క టవర్స్ వద్ద దారుసలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు.
- పీసీఆర్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్, బీజీఆర్ విగ్రహం వైపు అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.
- నాంపల్లి వైపు నుంచి కార్లలో వచ్చే ప్రజలు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్లో పార్కు చేసి.. అజంతా గేట్ (2) నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వెళ్లాలి.
- వీఐపీ కారు పాస్ ఉన్న వారు ఎంజే మార్కెట్ నుంచి గాంధీ భవన్ వరకు వచ్చి ఎడమ వైపు తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్-1, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు గాంధీ భవన్ వద్ద యూటర్న్ తీసుకొని గేట్-1, సీడబ్ల్యూసీ గేట్ ద్వారా లోపలికి వెళ్లాలి.
- చేప ప్రసాదం అనంతరం వీఐపీ వాహనాలు వీఐపీ గేట్, సీడబ్ల్యూసీ గేట్ నుంచి అదాబ్ హోటల్ నుంచి నాంపల్లి మీదుగా బయటకు వెళ్లిపోవాలి.