హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 29 మంది పిల్లలు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2022ను అందుకున్నారు. వారిలో హైదరాబాద్కు చెందిన 8ఏళ్ల తేలుకుంట విరాట్ చంద్ర ఒకడు. ఈ బుడతడు అతి పిన్న వయసులో కిలిమంజారో (Kilimanjaro) పర్వతాన్ని అధిరోహించాడు. 2013 అక్టోబర్ 9న జన్మించిన విరాట్, ఏడేళ్ల వయసులో (గతేడాది మార్చి 6న) కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5,895 మీటర్ల ఎత్తులోని శిఖరం అంచుకు ఆరు రోజుల్లో చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్ చంద్ర ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందాడు.
విరాట్ సాధించిన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ “రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీత యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్ చంద్రకు అభినందనలు. అతను ఇంత చిన్న వయస్సులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అతను మరింత ఉన్నత శిఖరాలను సాధించాలని కోరుకుంటున్నాను. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. “స్మృతి ఇరానీ కూడా ట్వీట్ చేస్తూ “దక్షిణాఫ్రికాలో కిలిమంజారో పర్వతం ఎత్తైన శిఖరం, ఈ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన ఆసియా పర్వతారోహకుడు తెలంగాణకు చెందిన 8 ఏళ్ల తెలుకుంట విరాట్ చంద్ర కావడం భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
తన కజిన్స్ ఇలానే పర్వతారోహణ చేశారని, వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది కిలిమంజారో ఎక్కాలని నిర్ణయించుకున్నానని విరాట్ చెప్పాడు. ఈ విషయం పేరెంట్స్కి చెప్పానని,వాళ్లు ఒప్పుకోవడంతో శిక్షణ తీసుకుని ఈ ఫీట్ సాధించానని అన్నాడు.
ప్రతి ఏటా కొత్త ఆవిష్కరణలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, సాహసం వంటి పలు రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కింద అవార్డులు అందిస్తారు. అవార్డులు అందుకన్నవారిలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 14 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు.