హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను వ్యతిరేకిస్తు్న్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆయన విమర్శించారు. మన దేశంలో విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని అన్నారు. అలాంటి భారత ప్రజల ఐక్యతను చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని అన్నారు. అందులో భాగంగానే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ తేల్చి చెప్పారు.