హైదరాబాద్: సర్వ మత సమానతను కొనసాగిస్తూ రాజ్యాంగం అందించిన లౌకిక స్పూర్తిని ప్రతిబింబించే విధంగా రాష్ట్ర సెక్రటేరియట్లో నిర్మించిన నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిని ఒకేరోజు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఆయా మత పెద్దలను సంప్రదించిన అనంతరం సీఎం కేసీఆర్ అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 25న హిందూ సంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని సీఎం తిరిగి తెరవనున్నారు. అదే రోజు ఇస్లాం, క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా మసీదు, చర్చిలను సీఎం ప్రారంభిస్తారు.
సీఎం కేసీఆర్ నిన్న (మంగళవారం) మంత్రులు, ముఖ్య కార్యదర్శి, సీఎంఓ, ఆర్ అండ్ బీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో సంప్రదింపులు జరిపి మూడు మతాల ప్రార్థనా స్థలాలను ఒకే రోజు తెరవాలని సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులతోనూ సీఎం చర్చించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం జారీచేసిన ప్రకటన ప్రకారం, సచివాలయ ఉద్యోగులు తమ పండుగల సమయంలో ఆచారాలు నిర్వహించడానికి ఈ మూడు మతపరమైన ప్రదేశాలు అందుబాటులో ఉంటాయి.
కొత్త రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో రెండు మసీదుల పునర్నిర్మాణానికి 2021 నవంబర్ 25న పాత సచివాలయ భవనాల కూల్చివేత సమయంలో కూల్చివేసిన ఐదు నెలల తర్వాత, హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో శంకుస్థాపన జరిగింది.
రెండు మసీదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,500 గజాలను కేటాయించగా, వీటికి రూ.2.9 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాత సచివాలయ భవనాల కూల్చివేతలో రెండు మసీదులు, ఒక దేవాలయం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శిథిలాలు పడటం వల్ల ప్రార్థనా స్థలాలు పాడైపోయాయని, ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలమైన ప్రదేశాల్లో ప్రార్థనా మందిరాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్లో చర్చితో పాటు మసీదులు, దేవాలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మిస్తామని 2021 సెప్టెంబర్ 5న కేసీఆర్ ప్రకటించారు.