హైదరాబాద్: ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేర పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని ఎల్అండ్టీ, మున్సిపల్ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతబస్తీలో మెట్రో రైలు పనులకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు ప్రారంభించింది.
రాబోయే కొద్దిరోజుల్లో హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు పాత నగరంలో మెట్రో రైలు పనులను చేపట్టడానికి 1,000 ఆస్తులకు భూసేకరణ నోటీసులు కూడా జారీ చేయనున్నారు.
పాత నగరంలో 5.5 కి.మీ బ్యాలెన్స్ మెట్రో అలైన్మెంట్ MGBS నుండి దారుల్షిఫా జంక్షన్ – పురానీ హవేలీ – ఎట్టేబార్ చౌక్ – అలీజాకోట్ల – మీర్ మోమిన్ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఉంది. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నుమాతో సహా 5 స్టేషన్లు ఉంటాయి. మెట్రో స్టేషన్ స్థానాలు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండి, ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
పాతబస్తీలో మెట్రో అలైన్మెంట్ ప్లాన్
ఈ ప్రాంతంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశాన వాటికలు, 6 చిల్లాలతో సహా 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయి. వయాడక్ట్ డిజైన్, ఎత్తుల సర్దుబాటు వంటి ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, మెట్రో పిల్లర్లకు తగిన మార్పు చేస్తున్నారు. తద్వారా నాలుగు మతపరమైన నిర్మాణాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడగలిగామని మెట్రో రైలు ఎండి. ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు, మతపరమైన కట్టడాలను రక్షించడానికి మెట్రో అలైన్మెంట్కు మరింత ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని వాడుతున్నారు. మతపరమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయనున్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫేజ్ 1 ప్రాజెక్ట్ నుండి పాఠాలు నేర్చుకోవడం, స్టేషన్ స్థానాల్లో రహదారిని 120 అడుగులకు విస్తరించడం జరుగుతుంది. 1000 ఆస్తుల స్వాధీనానికి గానూ నెల రోజుల్లో భూసేకరణ నోటీసులు జారీ చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.