హైదరాబాద్: ఎండి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని, కరువులో కూడా నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు సాగు నీళ్లు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద ఉన్న పెద్దవాగులో ఆదివారం 20, 21 ప్యాకేజీల ద్వారా కాళేశ్వరం నీటిని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం నీటిని నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎండిపోయిన వాగుల్లోకి నీరు చేరుతోందని, కరువులోనూ రైతుల పొలాలకు సాగునీరు అందుతుందన్నారు.
20, 21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్లెట్ వాల్వ్ను ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్యాకేజీ పనులు చేపట్టి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిందన్నారు.
ఇజ్రాయెల్ టెక్నాలజీతో ప్రాజెక్టును డిజైన్ చేసి పూర్తి చేసి రూరల్ నియోజకవర్గానికి కాళేశ్వరం నీరు చేరడం ఒక చరిత్ర అని అన్నారు. కరువు వచ్చినా సాగునీటికి అంతరాయం ఉండదు. ప్రభుత్వం ఇప్పటికే 25 చెక్డ్యామ్లను పూర్తి చేసిందని, భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయన్నారు.