హైదరాబాద్: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రాజధానిలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రూ.60,000 కోట్ల వ్యయంతో మెట్రోను విస్తరించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో 278 కిలోమీటర్ల మేర పెద్దఎత్తున మెట్రో ప్రాజెక్టు విస్తరించాలని తీర్మానించింది. హైదరాబాద్లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రోకు అదనంగా.. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఇందుకు అదనంగా మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా ఎనిమిది మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
ఫార్మా సిటీ రానుండడంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి జల్పల్లి, `తుక్కుగూడల మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్ టూ లెవెల్ కారిడార్ను నిర్మించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానిపై ఒక అంతస్తు వాహనాలు, మరో అంతస్తులో మెట్రో రైలు రాకపోకలుంటాయి.
పాట్నీ-కండ్లకోయ మార్గం
ఆదిలాబాద్ – నాగ్పూర్ మార్గంలో, కండ్లకోయ వద్ద ORRని కలుపుతూ ప్యాట్నీ స్టేషన్ నుండి మెట్రో పొడిగింపును మంత్రివర్గం ఆమోదించింది.
ఇస్నాపూర్ నుండి మియాపూర్
మరొక కారిడార్ ఇస్నాపూర్-మియాపూర్ మధ్య, తరువాత మియాపూర్ నుండి లక్డికాపూల్ వరకు అభివృద్ధి చేయవలసి ఉంది.
విజయవాడ రూట్లో ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు, వరంగల్ రూట్లో ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు మెట్రోను పొడిగించారు. దీనికి అదనంగా, ఉప్పల్, ఈసీఐఎల్ క్రాస్రోడ్లను కలుపుతూ మెట్రో లైన్ ఉంటుంది.
బెంగళూరు హైవేపై… శంషాబాద్ నుండి కొత్తూరు మీదుగా షాద్నగర్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. దీనికి తోడు శంషాబాద్ నుంచి కందుకూరు వరకు మరో లైన్ పొడిగించనున్నారు. రాబోయే ఫార్మా సిటీకి వేగవంతమైన కనెక్టివిటీని అందించడానికి ఇది ఉపయోగపడనుంది.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో అనుసంధానానికి ముఖ్యమంత్రి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నామని.. లేకున్నా మెట్రోను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు