హైదరాబాద్: అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. రైతు బీమా తరహాలో త్వరలో అసంఘటిత రంగ కార్మికులకు సైతం బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ… కూలీలకు డిజిటల్ కార్డుల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. డిజిటల్ కార్డుల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో చర్చించిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు బీమా కవరేజీని ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచుతామని హరీశ్రావు తెలిపారు. ఇటీవల కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. ఇకపై ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చని తెలిపారు.
అలాగే సిద్దిపేటలో కార్మిక భవన్ నిర్మాణానికి హరీశ్రావు ఎకరం భూమిని కేటాయించారు. కార్మికులను ఉద్దేశించి ఫోన్లో మాట్లాడిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. గతంలో పాలు, పూలు అమ్మేవారని, ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా సంబోధిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక కార్మిక భవన్ మంజూరు చేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు.
బీసీ బంధు పథకాన్ని హరీశ్రావు ప్రారంభించి బీసీలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా 300 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. అలాగే సిద్దిపేటలో బీసీ డిగ్రీ రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు.