హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. అన్నదాతలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మరోసారి రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నేడు అంటే ఆగస్టు 3 నుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలాపదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల., కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాటంకంగా కొనసాగిస్తూనే వస్తుంది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాల, నష్టాలు వచ్చినా ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తే లేదని” సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.