హైదరాబాద్: ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనంలో పయనిస్తోందని అర్థం. దేశ భవితకు ఆయువుపట్టుగా, బలమైన శక్తిగా నిలవాల్సిన యువత… ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటోంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువతకు వినాశనకరంగా మారింది. అందుకే మాదకద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలి. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ప్రబలుతున్న మాదకద్రవ్యాలను నియంత్రించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను కోరడంతో నగర పోలీసులు ముఖ్యంగా ఓల్డ్ సిటీలో డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాలను ముమ్మరం చేశారు.
ఆగస్టు 9వ తేదీ బుధవారం నాడు పత్తర్గట్టి అగర్వాల్ డిగ్రీ కళాశాలలో డిసిపి సౌత్ జోన్ పి సాయి చైతన్య మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్ వాడటం మానుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు.
రెయిన్ బజార్లోని అఫ్రీన్ ఫంక్షన్ హాల్లో కూడా ఇదే విధమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం నిర్వహించిన మీర్చౌక్ ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలన్నారు.
ఫాతిమానగర్లో ఎస్హెచ్ఓ ఎస్ రాఘవేంద్ర ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని, చదువులు, విద్యాభివృద్ధి, కెరీర్పై దృష్టి పెట్టాలని ఎస్హెచ్ఓ కోరారు.
బహదూర్పురా పోలీసులు మెడికల్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించి నిషేధిత మందులు ఎవరికీ అందించవద్దని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.