హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను TSPSC ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదట ఈనెల 29, 30వ తేదీల్లో నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే వరుసగా పోటీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో, తాము ఏ పరీక్షలకూ సరిగా సన్నద్ధం కాలేకపోతున్నామన్న అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు టీఎస్పీఎస్సీ గ్రూప్ -2 పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్-2 కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రస్తుత పరీక్ష తేదీకి, కొత్త పరీక్ష తేదీకి మధ్య కనీసం రెండు నెలల సమయమైనా ఇవ్వాలని కమిషన్ భావించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రకటించారు. రెండు రోజులు.. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.
పరీక్షకు వారంరోజుల ముందు నుంచి https://www.tspsc.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది నవంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.