హైదరాబాద్: ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదం మహారాష్ట్రలో పలు వర్గాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. పలు చిన్నాచితక పార్టీలు సైతం.. బీఆర్ఎస్లో విలీనమవుతుండటం విశేషం. తాజాగా మరోపార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది. మహారాష్ట్రకు చెందిన స్వరాజ్య మహిళ సంఘటన్.. బీఆర్ఎస్లో కలిసిపోయింది. ఆ పార్టీ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే.. తన అనుచరులు, పార్టీ సభ్యులతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిసిన ఆమె.. బీఆర్ఎస్ పార్టీకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వనిత తాయి గుత్తె మాట్లాడుతూ… తెలంగాణలోని మహిళా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ఇలాంటి విధానాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని మహారాష్ట్ర నేతలు ఆకాంక్షించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
సమాజంలోని పేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని లక్ష్యంతో విలీన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలను ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలను చిత్తుశుద్ధితో పాటిస్తానని వనితా తాయి పేర్కొన్నారు. జీవితాంతం బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
స్వరాజ్య మహిళా సంఘటనతో పాటు మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బుల్ధానా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంఖడే, స్టేట్ యూనియన్ వరర్ (సభ్యుడు) రామ్రావ్ షిండే పాటిల్, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భయ్యాసాహెబ్ పాటిల్, పంచాయతీ సమితి సభాపతి సురేశ్ మిస్రవ్, శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, కార్పొరేటర్, ఎన్సీపీ తాలూకా ప్రెసిడెంట్ జయంత్ దరి, మహిళా అఘాడీకి చెందిన మనీషా దరి, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదారే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ముఖ్, లాహురావ్ మడే, అషిప్ యాతల్, సునీల్ జాదవ్, సంతోష్ రాథోడ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.