హైదరాబాద్: మూసీ ఒడ్డున నివాసం ఉంటున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అక్కడ నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందులోభాగంగా.. మూసీ నది ఒడ్డున నివాసం ఉంటున్న 10,000 వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ అక్రమణల తొలగింపు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో భాగంగా.. నగర ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా వినతి పత్రం అందజేయగా.. ఈ మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించారు.
హైదరాబాద్లో వరదలను నివారించడంలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (SNDP) విజయవంతమైందని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. వరదలను ఎదుర్కొన్న చరిత్ర ఉన్న ప్రాంతాలకు ఈ వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలు అన్నారు. ఈ సందర్భంగా మూసీ నది, ఎస్ఎన్డీపీ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు మద్దతు తెలిపారు.
మూసీపై ఉన్న కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. SNDP రెండవ దశ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే మంజూరీ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు.
ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. ప్రభుత్వం ప్రాథమిక ప్లానింగ్ కూడా పూర్తి చేసింది. నగరంలో ప్రవహిస్తోన్న మూసీ నదిపై 15 చోట్ల వంతెనలు కట్టాలని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే.. మూసీ అభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగించిన తర్వాతే ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం కానున్నట్టు సర్కారు భావిస్తోంది.