హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలలు నిండని శిశువులకు అత్యవసర వైద్య సదుపాయాలు సకాలంలో అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనాటల్ అంబులెన్స్లను ప్రభుత్వం ప్రారంభించింది.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యవసర ఆరోగ్య సంరక్షణ అవసరమైన నెలలు నిండని శిశువులను తరలించే సదుపాయాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి.
నియోనాటల్ అంబులెన్స్ల నిర్వహణకు ఏడాదికి రూ.8.07 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ అంబులెన్స్లో నియోనాటల్ ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్, నియోనాటల్ ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, ఆక్సిజన్, హ్యూమిడిఫైయర్, పల్స్ఆక్సీమీటర్, సుదీర్ఘ బ్యాటరీతో సిరంజి పంప్ తదితర సౌకర్యాలు ఉంటాయి.
ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ…మాతాశిశు సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని దీని వెనుక సీఎం కేసీఆర్ కృషి, వైద్యసిబ్బంది శ్రమ ఉన్నదని మంత్రి చెప్పారు.
మాతా శిశు సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. దీంతో గాంధీలో మాతా శిశు సంరక్షణ పడకల సంఖ్య 500కు పెరిగిందని మంత్రి హరీశ్ వివరించారు.
మాతా శిశువుల సంరక్షణ చాలా ప్రధానమైనదని, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక అంశమని హరీశ్రావు పేర్కొన్నారు. తల్లీ బిడ్డల ఆరోగ్యంపైనే కుటుంబ ఆరోగ్యం, రాష్ట్ర, దేశ ఆరోగ్య స్థితిగతులు ఆధారపడి ఉంటాయని వివరించారు. తల్లీ బిడ్డల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ పలు ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టారని, బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రిషన్కిట్, బిడ్డ పుట్టగానే కేసీఆర్కిట్ను అందజేస్తున్నారని గుర్తుచేశారు.
క్వాలిటీ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్లో తొలిసారిగా గాంధీ దవాఖానకు ఐఎస్వో సర్టిఫికెట్ రావడం పట్ల మంత్రి హరీశ్రావు అభినందించారు. మొదటిసారి గాంధీలో లివర్ రిట్రీవర్ చేసి, ఉస్మానియా దవాఖానలోని రోగికి అందిస్తున్నట్టు తెలిపారు.