హైదరాబాద్: నిరుద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్తో తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కొన్నిటిని భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 6,612 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్ డిసెబుల్డ్లో 1,523 పోస్టులు ఉన్నాయి. వీటిని టిఎస్పిఎస్సి ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా నిర్వహించాలని భర్తీ చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా, డీఈవో సెక్రటరీగా, జిల్లా పరిషత్ సీఈవో సభ్యులుగా ఉండే ఈ కమిటీ నియామకాలను చేపడుతుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ను జారీ చేస్తారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల నుంచి కళాశాలలు, యూనివర్సిటీలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మరోవైపు నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి తెలిపారు. 1,947 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా, 2,162 మంది టీచర్లకు పీఎస్హెచ్ఎంలుగా, మరో 5,870 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు. “దీని తర్వాత, మిగిలిన ఖాళీలను తాజాగా నియమించడం జరుగుతుంది,” ఆమె చెప్పారు.
సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించి సెప్టెంబర్ 27న ఫలితాలు వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది.