తొర్రూరు: తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగును రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోంది. సాగు విస్తీర్ణాన్ని విస్తరించేలా రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గోపాలగిరిలో పామాయిల్ ఫ్యాక్టరీకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. హరిపిరాల గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో 6,535 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 82 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ. 175 కోట్లు ఖర్చు చేయనున్నారు. గంటకు 60 టన్నుల ఆయిల్ ఫామ్ గెలలను మిల్లింగ్ చేసే సామర్థ్యం గల ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అతిపెద్దది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సుమారు 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల పామాయిల్ సాగు విస్తీర్ణం పెరగడమే కాక ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉంటుంది.