హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కెటి రామారావు హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులతో నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మొదటి దశలో దాదాపు 11,700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామన్నారు. రెండో దశలో దాదాపు 13,300 ఇళ్లు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా పేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మొదటి దశ కింద 11,700 వేల ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామని మంత్రి అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నామని తెలిపారు. “మీడియా సమక్షంలో పారదర్శకంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డ్రాలతో కూడిన ప్రక్రియలో ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు ఎవరికీ చెప్పుకోలేరు” అని ఆయన అన్నారు.
హైదరాబాద్లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యూనిట్ల మొత్తం ఖర్చు రూ.9100 కోట్లు అయితే మార్కెట్ విలువ రూ.50 వేల కోట్లకు పైగానే ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా ఇళ్లను ఇస్తోందని తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ‘అలసట లేకుండా నిబద్ధతగా’ పనిచేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి అభినందించారు.