హైదరాబాద్: ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం – మిలాదున్ నబి ఊరేగింపు ఒకే రోజు రావడంతో.. విగ్రహ నిమర్జనంలో ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా మీలాదున్ నబి ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు పాతబస్తీ మత పెద్దలు వెల్లడించారు.
హిజ్రీ క్యాలెండర్లోని రబీ ఉల్ అవల్ మాసం 12వ రోజున భారీ ఎత్తున జరిపే ఈ వేడుకలను విరమించుకుంటున్నట్లు సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అంజుమన్ ఇ క్వాడ్రీ, సీరత్-అన్-నబీ అకాడమీ సైతం ఇదే నిర్ణయం తీసుకున్నారు.
“కొన్ని వ్యతిరేక శక్తులు ఈ ర్యాలీలో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే అవకాశముంది. ఈ కారణాల వల్ల నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ ఏడాది ఊరేగింపును రద్దు చేశాం’’ అని సీరత్ ఉన్ నబీ అకాడమీ ఆఫీస్ బేరర్ సయ్యద్ గులాం సమ్దానీ అలీ క్వాద్రీ తెలిపారు.
ఈ ఊరేగింపులో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చార్మినార్ వద్దకు చేరుకుంటారు. ఊరేగింపు మార్గంలో అన్నదాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మిఠాయిల పంపిణీ చేపడతారు.
అయితే మరికొన్ని సంస్థలు తమ ఊరేగింపులను రద్దు చేయడం లేదా రీషెడ్యూల్ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆయా సంస్థలు అన్ని పరిస్థితులు బేరీజు వేసుకొని వారు తమ ఊరేగింపును తిరిగి రీ షెడ్యూల్ చేయటం లేదా ముస్లిం ఆధిపత్య ప్రాంతాల గుండా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది.