హైదరాబాద్: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జూన్ 2, 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో పోటీ అథారిటీ కోటా సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలినవి అన్నీ (85 శాతం) తెలంగాణకే వారికేనని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
హైకోర్టు తీర్పుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ బిడ్డలకు ఏటా 1,820 ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయని తెలిపారు. ఇది 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానమని చెప్పారు.
‘ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చొరవ వల్ల 85 శాతం ఎంబిబిఎస్ ‘బి’ కేటగిరీ సీట్లను స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. హైకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు మరో 520 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి, దీంతో తెలంగాణ విద్యార్థులకు ఏటా 1,820 ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి.
ఎంబీబీఎస్ సీట్ల భర్తీ విధానంలో మార్పులుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న జారీచేసిన జీవో 72ను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన సానికొమ్ము వెంకటసాయి భరత్రెడ్డి మరికొందరు దాఖలుచేసిన 63 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 72 రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేసింది.