హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ విద్యలో ‘సైబర్ సెక్యూరిటీ’ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును అమలులోకి తీసుకువచ్చామని మంత్రి చెప్పారు.
ఈ కోర్సులో సైబర్ సెక్యూరిటీ పరిచయం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, సైబర్ చట్టాల ప్రాథమిక అంశాలు, సైబర్ క్రైమ్లు, డిజిటల్ ఫోరెన్సిక్స్ పరిచయం, సోషల్ నెట్వర్క్లు,సైబర్ సెక్యూరిటీ, ఇ-కామర్స్ మరియు సైబర్ సెక్యూరిటీతో సహా ఐదు మాడ్యూల్స్ ఉన్నాయి. 100 మార్కులున్న ఈ కోర్సును పూర్తిచేస్తే నాలుగు క్రెడిట్స్ జారీచేస్తారు. ప్రాక్టికల్స్కు 30మార్కులు, థియరీ ఎగ్జామ్ 70 మార్కులకు నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ సెషన్ల కోసం, విద్యార్థులు లైవ్ డెమో కేస్ స్టడీస్తో కూడిన వర్చువల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఎంచుకోవాలి లేదా సైబర్ సెక్యూరిటీ వ్యాపారంలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీలు, బ్యాంకులు మరియు IT కంపెనీల వంటి సంస్థలతో ఇంటర్న్షిప్లను ఎంచుకోవాలి.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…సీఎం కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు విద్యార్థులను సైబర్ యోధులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన విద్యార్థులు పోటీ పడేలా సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరంలో సైబర్ సెక్యూరిటీలో పూర్తి స్థాయి కోర్సును ప్రవేశపెడతామని ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు.
ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్బీ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు. మూల్యాంకనంపై ఐఎస్బీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
.