హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రతీ రోజు బ్రేక్ పాస్ట్ను అందించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి “ముఖ్యమంత్రి అల్పాహారం” (ముఖ్యమంత్రి అల్పహార) పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకోవడానికి వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. ఉదయాన్నే తమ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్కు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. మానవీయ ఆలోచనతో ఈ అల్పాహారం పథకాన్ని రూపొందించారు.
ఈ స్కీమ్ తమిళనాడుతో విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ అమలవుతున్న విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని పంపించారు. అధికారుల బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించి.. విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేశారు. ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఆ రాష్ట్రంలో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారని అధికారుల బృందం సీఎం కేసీఆర్కు వివరించారు.
మన రాష్ట్రంలో అందరు విద్యార్థులకు లబ్ధి చేకూరాలని సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టు స్కీమ్ను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర సర్కారు ఖజానాపై ప్రతి యేటా దాదాపు రూ.400 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు చెబుతున్నారు.