హైదరాబాద్: నిన్న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) 2023 సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి.
ఎప్పుడూ కఠినంగా వచ్చే పేపర్-1 ప్రశ్నాపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్-2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. అభ్యర్థుల్లో లోతైన విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేలా ప్రశ్నపత్రం రూపొందించారని నిపుణుల అంచనా.
టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్సైట్లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి ప్రకారం తుది కీ ప్రకటిస్తారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.
టెట్ పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 84.12 శాతం మంది పేపర్కు హాజరయ్యారు. I నుండి V తరగతులకు బోధనా అర్హతను కోరుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను నిర్వహించారు.
అదేవిధంగా VI నుండి VIII తరగతుల ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం జరిగిన పేపర్ – II కోసం 2,08,498 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 1,89,963 మంది హాజరయ్యారు.