హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో డిసెంబర్ 3 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మరోవంక అధికారులు సోదాల్లో టన్నుల కొద్దీ నగదు పట్టుబడుతోంది. ఇది సామాన్య ప్రజలలో ఒకరకమైన భయాందోళనలకు దారితీసింది. వారు ఎక్కువ డబ్బుతో ప్రయాణాలు చేయటం కుదరదు. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. అధికారులు సీజ్ చేస్తారు. ప్రత్యేకించి చిరు వ్యాపారుల లావాదేవీలు నగదు ద్వారా జరుగుతాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ.50వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
ఒక వ్యక్తి గరిష్టంగా రూ.50,000 నగదును తీసుకెళ్లవచ్చని, దీనికి ఎలాంటి పత్రం అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఎవరైనా నగదును రూ. 50000 కంటే ఎక్కువ ఉంటే, ఆ వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేకపోయినా, డబ్బును తీసుకెళ్లిన ఉద్దేశ్యం ఏమిటో నిర్ధారించలేకపోతే, దానిని స్వాధీనం చేసుకుంటారు. రూ.50 వేలకుపైగా ఉన్న నగదును సీజ్ చేసి ఎన్నికలతో సంబంధం లేదని రుజువైన తర్వాతే విడుదల చేస్తారు.
అధికారులకు చూపించాల్సిన ఆధారాలు
- నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటి
- వస్తువులు, ధాన్యం విక్రయం డబ్బు అయితే బిల్లు
- భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యుమెంట్లు
- వ్యాపారం, సేవల డబ్బు అయితే లావాదేవీల వివరాలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసిన తర్వాత, వ్యయ పరిశీలకులు, నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, పోలీసులు రాష్ట్రంలో చురుకుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటుంది. స్క్వాడ్లు, పరిశీలకుల నియామకాన్ని భారత ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షిస్తుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఐదు రాష్ట్రాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటికే వారిని నియమించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ తేదీ – నవంబర్ 03
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10
- నామినేషన్ల పరిశీలన – నవంబర్ 13
- నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ – నవంబర్ 15
- పోలింగ్ – నవంబర్ 30
- ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 03