ఖమ్మం: ఖమ్మం కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిపుణులైన కన్సల్టెంట్లను నియమించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు పురావస్తు శాఖ, మ్యూజియం శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్లు రామకృష్ణ, శ్రీదర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తితో మంత్రి నిన్న సమావేశమయ్యారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు కోటలో రోప్వే, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, ఫుడ్ కోర్ట్, మెట్లకు రెయిలింగ్, లైటింగ్, కూర్చునేందుకు బెంచీలు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు కల్పించాలని మంత్రి కోరారు.
క్రీ.శ. 950లో కాకతీయ పాలకులు నిర్మించిన చారిత్రాత్మక కోటను ఒక ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు గత BRS పాలనలో ఒక ప్రాజెక్ట్ను చేపట్టారు. అందులో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రూ.61.80 లక్షలు వెచ్చించి జాఫర్ బావిని పునరుద్ధరించారు.
వర్షపు నీటి నిల్వ కోసం ఉపయోగపడే ఈ బావి… కోట దక్షిణ భాగంలో కాకతీయుల పాలన నుండి ఉంది. అసఫ్ జాహీస్ కాలంలో తాలూక్దార్ జాఫర్-ఉద్-దౌలా (1716-1803) బావిని పునరుద్ధరించారు. అందుకే దీనిని జాఫర్ బౌలీ (బావి) అని పిలుస్తారు.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశాలను అనుసరించి, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పర్యవేక్షణలో హైదరాబాద్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ బావిని పునరుద్ధరించడానికి పనులు ఏప్రిల్, 2023 లో ప్రారంభించారు.
బావిలోని నీటిని తోడేందుకు రెండు 7హెచ్పీ మోటార్లను 23 రోజుల పాటు ఆపరేట్ చేశారు. అనంతరం 24 మంది కార్మికులు 90 రోజుల పాటు నిమగ్నమై బావిలోని దాదాపు 2.12 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక, చెత్తను తొలగించారు. బావి 60 అడుగుల పొడవు, 70 అడుగుల లోతు, 60 అడుగుల వెడల్పు ఉంటుంది.
ఖమ్మం కోటలోని మెట్లబావి ‘జాఫర్ బావి’ పునరుద్ధరించి ఫిబ్రవరి 17న ప్రారంభించిన విషయం తెలిసిందే.