24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి… ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం !

హైదరాబాద్: పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో  అకాల మరణం చెందింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రమాదం తర్వాత, లాస్య నందితను అత్యవసర వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొద్దిరోజులకు ఆమె అనూహ్య మరణం పొందటం విషాదకరం.

ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై సదాశివపేట నుంచి పటాన్ చెరువు వస్తుండగా.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద నేడు తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కాగా లాస్యనందిత ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. మూడు ప్రమాదాలు జరగ్గా.. మూడోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. గతంలోనూ అసెంబ్లీ బయట పెను ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఫిబ్రవరి 13న బహిరంగ సభకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. మూడవసారి మాత్రం మృత్యువునుంచి తప్పించుకోలేకపోయారు.

2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న  గతేడాది ఫిబ్రవరి 19న  ఆకస్మికంగా మరణించటంతో ఆ స్థానం నుంచి ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles