హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare Residential Educational Institutions Society)కి చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్లో సీట్లు సాధించారు. మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్ లో 190 మంది విద్యార్థులు సీట్లు సాధించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించారని తెలిపారు. వీరిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు చదువుకోలేదని, ఇంట్లో తొలి డాక్టర్ కాబోతున్నారని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. టీచింగ్ స్టాఫ్ సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే ఇలాంటి ఫలితాలు సాధించామని లెక్చరర్లను కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందించారు. పేద విద్యార్థులకు చదువుతో పాటు కెరీర్ గురించి టీచింగ్ స్టాఫ్ దిశా నిర్దేశం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో సీట్లు సాధించి వారి కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సోసైటీ (TSWREIS)లో చదువుకుంటున్న విద్యార్థులు కార్పొరేట్ సంస్థల విద్యార్థులతో పోటీపడి సీట్లు సాధించడంపై ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల విద్య కోసం నీట్ కోచింగ్ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని రోనాల్డ్ రాస్ తెలిపారు.