హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన Hawk Eye , TSCOP యాప్లు, ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్ను అరెస్టు చేశారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన TGCSB అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా టీజీసీఎస్బీ అధికారులు ఢిల్లికి వెళ్లి చోరీ చేసిన డేటాను ఆన్లైన్లో విక్రయానికి పెట్టిన నిందితుడు జితిన్కుమార్ను గుర్తించి అరెస్ట్ చేసారు. గ్రేటర్ నోయిడాలో నిందితుడిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్పై హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు డీజీపీ వివరించారు.
నిందితుడు తన ఆచూకీ కనుగొనకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని అయితే సాంకేతిక పరిజ్ఞనంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హ్యాకర్ జితిన్పై గతంలోనూ సైబర్ కేసులున్నాయని, ఢిల్లిలోని ద్వారక పోలీస్స్టేషన్లో 2023లో సైబర్ నేరాలకు పాల్పడ్డారన్నారు.
నిందితుడు చోరీ చేసిన డేటా ఏమాత్రం బయటకు వెళ్లలేదని, తెలంగాణ పోలీసు శాఖ యాప్లలో బలహీనమైన పాస్వర్డ్ల కారణంగా డేటా చోరీ అయినట్లు తేలిందన్నారు. టీఎస్కాప్లో కీలకమైన సమాచారమేమీ లేదని, అత్యంత కీలకమైన డేటా హ్యాక్కు గురైందనని మీడియాలో ప్రచారం చేయడం తగదని తెలిపారు.
ఇకముందు పోలీస్ యాప్లకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కేసును సకాలంలో ఛేదించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు కెవిఎం ప్రసాద్, ఎ.సంపత్,ఇన్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి, కానిస్టేబుల్ సురేష్లను డిజిపి అభినందించారు.