హైదరాబాద్: జనాభా ఆధారంగా 2022-23కి మైనార్టీల బడ్జెట్ను కేటాయించాలని, మంజూరైన నిధుల్లో వంద శాతం వినియోగించాలని అఖిల భారత ముస్లిం నేతల సదస్సు(ఏఐఎంఎల్సీ) డిమాండ్ చేసింది. “ద ఆల్ ఇండియా ముస్లిం లీడర్ కాన్ఫరెన్స్” (AIMLC) సభ్యులు మాట్లాడుతూ… మైనారిటీ సంస్థల సంక్షేమం, అభ్యున్నతికి బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా ఉపయోగించడం లేదు. టీఎస్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ఉన్నా లేనట్టే అయింది. 2014లో ఏర్పాటైన టీఎస్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ చుక్కాని లేని నావలా తయారైంది. అక్కడ మూడేళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.. రాష్ట్రప్రభుత్వం ముందుగా సంక్షేమ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మైనారిటీల సంక్షేమానికి కార్పొరేషన్ ప్రారంభించాలని ఏఐఎంఎల్సీ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ శంషాద్ ఖాద్రీ డిమాండ్ చేశారు. ఉర్దూ కంప్యూటర్ సెంటర్లను పునఃప్రారంభించాలని, ముస్లింల స్వయం ఉపాధికి రుణాలు, సూక్ష్మ రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో, క్యాబ్ రుణాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ వంటి ప్రయోజనకరమైన పథకాలను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పునఃప్రారంభించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దర్గా హజరత్ హుస్సేన్ షా వలీ ఆధ్వర్యంలో మణికొండ జాగీర్ వద్ద రూ.లక్ష కోట్ల విలువైన 1,662 ఎకరాల వక్ఫ్ భూమిని తిరిగి ఇవ్వాలని సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుస్సేన్ షా వలీ భూమిని కాపాడుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారని, ఈ భూమిపై సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుని వక్ఫ్ బోర్డుకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఏఐఎంఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ షా ఖైరుద్దీన్ సూఫీ అన్నారు.