23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ‘పీకే’… ఆసక్తి రేపుతున్న ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటన!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్… సీఎం కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ ఆలోచనలు, వ్యాఖ్యలపై పీకే బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలు సేకరిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్… సంబంధిత అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అంతేకాదు ఇటీవల ముంబయి పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చల సారాంశం, తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు చెప్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై అధ్యయనం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ అనుసరించాల్సిన ప్రణాళికలపై దృష్టి సారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే ‘పీకే’ టీఆర్‌ఎస్‌తో జతకట్టినట్లు కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, జాతీయ రాజకీయాలలోని వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ నేరుగా పర్యవేక్షిస్తారని రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ‘పీకే’ తెలంగాణ పర్యటన ప్రారంభమైంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ నిన్న ప్రకాష్ రాజ్ తో కలిసి మల్లన్న సాగర్ లో పర్యటించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ‘పీకే’ అండ్ టీమ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, మార్చి 10న జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహం రచించే అవకాశం ఉందని ఐపీఏసీ(IPAC) టీమ్ సభ్యులు ఇప్పటికే చెప్పినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి ఒక దశ ప్రాథమిక సర్వేను పూర్తి చేసి, దీనిపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు కూడా ప్రశాంత్ కిషోర్ సూచనలు చేస్తారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా మారారు. ప్రశాంత్ కిషోర్ అధికార పార్టీ తరపున పనిచేస్తుండగా, ఆయనతో సన్నిహితంగా పనిచేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్నారు. కాగా, కేసీఆర్ సూచన మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్‌ను సందర్శించారు. పీకే రంగంలోకి దిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నట్లు సమాచారం. మార్చి 10న 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో పీకే టీమ్ ల్యాండ్ అవుతుందని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles