హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 400, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి.
ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. అగ్రికల్చర్, మెడికల్ ఎగ్జామ్ను జూన్ 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ ఎగ్జామ్ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం, https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్ను సందర్శించండి.
ఇంటర్ వెయిటేజీ లేదు..
ఇంటర్మీడియెట్ మార్కులను ఎంసెట్లో వెయిటేజ్గా తీసుకోవడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్ రాసే ఇంటర్ సెకండియర్ విద్యార్థులు గత ఏడాది ఆఖరులో జరిగిన ఇంటర్ ఫస్టియర్లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.