హైదరాబాద్: చారిత్రాత్మకమైన కింగ్ కోఠి ప్యాలెస్ను గత నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి కొనుగోలు చేసిన బిల్డర్ కూల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ కావడంపై పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు. వారసత్వ కట్టడం కూల్చివేతపై నిఘా ఉంచాలని ఆదివారం పోలీసు శాఖను కోరింది. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం, ప్యాలెస్లోని కొంత భాగాన్ని నేలమట్టం చేసి చదును చేశారు. అదేవిధంగా సీలింగ్, గోడలు కూడా నేలకూలాయి. అయితే పాత స్విమ్మింగ్ పూల్, బావి, 101 గదుల జెనానా (మహిళల క్వార్టర్)ని అలాగే వదిలేసినట్లు స్థానికులు తెలిపారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ, “కింగ్ కోఠి ప్యాలెస్ నోటిఫైడ్ హెరిటేజ్ కట్టడం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) నుండి ముందస్తు అనుమతి లేకుండా దీనిని కూల్చివేయడం సాధ్యం కాదు.” కింగ్ కోఠి ప్యాలెస్ సివిల్ వివాదంలో ఉందని కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలిపారు. ఏదైనా కూల్చివేతలు జరిగితే సమాచారం ఇవ్వాలని ప్యాలెస్ చుట్టుపక్కలవారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. పోలీసుల నిఘాలో ఉందని వెల్లడించారు. అంతేకాదు ప్యాలెస్ రూపురేఖలు ఏమాత్రం మార్చవద్దని, ఇక్కడ ఎటువంటి కూల్చివేతలు వద్దని నోటీసులు అందజేసినట్లు ఆయన చెప్పారు.
వివాదాల్లో ప్యాలెస్
కింగ్కోఠి ప్యాలెస్ ప్రస్తుతం వివాదాల్లో ఉంది. ఐదారేళ్ల క్రితమే నిజాం వారసుల నుంచి స్థలాన్ని తాము కొనుగోలు చేశామని మహారాష్ట్రకు చెందిన ఓ నిర్మాణ సంస్థ చెబుతోంది. ఆ సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామని కశ్మీర్కు చెందిన మరో సంస్థ వాదిస్తోంది. తాజాగా ఇరు కంపెనీల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు. ప్యాలె్సతోపాటు దాని ఖాళీ స్థలం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో పక్క రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ సంస్థ దీన్ని ఎలా హస్తగతం చేసుకుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్యాలెస్ క్రయ, విక్రయాల్లో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ప్యాలెస్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తిగా పెద్దల కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. రిజిస్ర్టేషన్ విషయం ఐదారేళ్లుగా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, హైదరాబాద్ చరిత్ర ఘనతను కళ్లకు కట్టే ఏడో నిజాం నివాస గృహాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని, కింగ్కోఠి ప్యాలెస్ అమ్మడానికి వారెవరు, కొనడానికి వీరెవ్వరూ.? అని చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.