హైదరాబాద్: నగరవాసులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలిగిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు… ప్రయాణీకుల సౌకర్యార్థం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఎలక్ట్రిక్ ఆటోలు (E-Auto) సేవలను ఏర్పాటుచేసింది. నగరంలోని మెట్రో రైలుస్టేషన్ల కేంద్రంగానే ఈ ఆటోలు నడవనున్నాయి. నిన్నటినుంచి ఈ-ఆటో సేవలు పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఆటో కావాలనుకున్న వారు మెట్రోరైడ్ (Metro Ride) యాప్ ద ఆటోలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో మెట్రోరైడ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణ అనుగుణంగా ఆటోలను బుక్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ధరలను నిర్ణయించామని తెలిపారు. మొదటి కిలో మీటర్కు రూ.10, తర్వాత కి.మీకు రూ.6 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు దిగిన తర్వాత 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణికుడిని రిసీవ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ కెవిబి రెడ్డి మాట్లాడుతూ… మెట్రో కారిడార్లోని పరేడ్గ్రౌండ్, ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 15 ఆటోల చొప్పున అందుబాటులో ఉంటాయి. మెట్రో రైడ్ సంస్థ నడుపుతున్న ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఎంతో సురక్షితమైనవి. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం ద్వారా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మెట్రోరైడ్ యొక్క CEO మరియు సహ వ్యవస్థాపకుడు గిరీష్ నాగ్పాల్ మాట్లాడుతూ… ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో మెట్రో రైడ్ సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ ఆటోల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. డబ్ల్యుఆర్ఐ, షెల్ ఫౌండేషన్ సంస్థల సహకారంతో హైదరాబాద్లోని మెట్రో స్టేషన్ల నుంచి ఎలక్ట్రిక్ ఆటోలను నడుపనున్నాం. వీటి ద్వారా ప్రతియేటా 10లక్షల మంది ప్రయాణించేలా చర్యలు తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్, L&T, డబ్ల్యుఆర్ఐ ఇండియా, షెల్ ఫౌండేషన్ల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. నగరంలోని మహిళలకు ఉపాధి కల్పించే ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్నింటిని ‘షీ’ ఆటోలుగా మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.