హైదరాబాద్: వచ్చే పదేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమలు, ఎంఏ అండ్యూడీ శాఖల మంత్రి కె.టి.రామారావు తెలిపారు. మహేశ్వరం రావిర్యాల్ గ్రామంలోని ఫ్యాబ్ సిటీ సెజ్లో రేడియంట్ అప్లయెన్సెస్ & ఎలక్ట్రానిక్స్ కొత్త ప్లాంట్ను సోమవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే రెండు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉండగా, మరో రెండు క్లస్టర్లు రానున్నాయని, సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకత్వంతో హైదరాబాద్కు మించి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు విస్తరిస్తున్నాయని, ఈ క్లస్టర్ల కోసం మరిన్ని భూములను గుర్తిస్తున్నామన్నారు.
ఉత్పాదక సంస్థలు వాటి కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తగిన సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీలో ప్రస్తుతం 15 వేల మంది పనిచేస్తున్నారని.. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 40 వేలకు చేరుకొంటుందన్నారు. ‘రాష్ట్రం పరిశ్రమలకు,ఇతర వినియోగదారులకు 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తున్నది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు ముఖ్యమైంది నాణ్యమైన విద్యుత్తు సరఫరా. కరెంటు రాకపోతే ఉత్పత్తి లోపిస్తుంది. దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రేడియంట్ అప్లయెన్సెస్ & ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతూ, కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ తయారీదారు అని అన్నారు. ఇది దాదాపు 3,800 మంది వ్యక్తులకు ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది, వీరిలో 53 శాతం మహిళలు మరియు 60 శాతం తెలంగాణకు చెందినవారు. దాని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టి మరో 1,000 మందికి ఉపాధి కల్పించింది. హైదరాబాద్కు చెందిన కంపెనీ ప్రతి 14 సెకన్లకు ఒక టీవీని తయారు చేస్తుంది మరియు దేశంలో తయారయ్యే అన్ని టీవీలలో ఇది 25 శాతం వాటాను కలిగి ఉంది. ఇది దాని సామర్థ్యాన్ని సంవత్సరానికి 2.1 మిలియన్ టీవీల నుండి సంవత్సరానికి 4.5 మిలియన్ టీవీలకు రెట్టింపు చేసింది. అనుకూలమైన వ్యాపార వాతావరణం కారణంగా ఇది తన ఆదాయాలను 35 రెట్లు పెంచుతుంది. అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.