హైదరాబాద్: పేదల సంక్షేమం కోసం అన్ని వసతులతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో బస్తీ దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ గురువారం తెలిపారు. మంత్రి గురువారం తన మాసాబ్ ట్యాంక్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులను ఉద్దేశించి శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. ఒకే గదిలో రద్దీగా ఉండే పేదల కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బడుగు బలహీన వర్గాలకు సక్రమంగా జీవించేందుకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలనే ఆలోచన చేసారు. దేశంలోనే కాకుండా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి లైన్లు, విద్యుత్ సరఫరా వంటి అన్ని సౌకర్యాలతో నిర్మించిందని మంత్రి తెలిపారు.
హైదరాబాద్లో ప్రభుత్వం 22 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఉచితంగా మంజూరు చేసిందన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలందించేందుకు డబుల్ బెడ్రూం కాలనీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. కొత్త కాలనీలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో చర్చించాలని కలెక్టర్ను కోరారు.