హైదరాబాద్: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా జాబ్ మేళా(Job Mela)లు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్యర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. ఈ సంస్థలతో పాటు పలు సంస్థలు నేరుగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా నిజాం కళాశాల ప్రాంగణంలో వివిధ కార్పొరేట్, ఇతర సంస్థల ఆధ్వర్యంలో మే 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
బీపీఓ, ఐటీ, సాఫ్ట్వేర్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ (BFSI) సహా వివిధ రంగాలకు చెందిన 30 కంపెనీలు సుమారు 3,500 ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ మేళాలో పాల్గొంటాయి. నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి భీమా కోరారు.
లియోనైన్ కన్సల్టింగ్ సంస్థ సహకారంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. నిజాం కళాశాల సానిటరీ బ్లాక్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా ఉదయం 10గంటలనుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది.. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజాం కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. స్రవంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
యూజీ, పీజీ, బీఈ లేదా బీటెక్ అర్హత కలిగిన నిరుద్యోగ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో ఉద్యోగానుభవం ఉన్నవారు కూడా హాజరుకావచ్చని ప్రొ.భీమా శనివారం తెలిపారు. మరిన్ని వివరాలకు 9849163707కు ఫోన్ చేయొచ్చు.