హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై ముస్తారికా మజ్లిస్-ఏ-అమాల్ ప్రతినిధి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి సయ్యద్ అహ్మద్ పాషా ఖౌద్రీతో పాటు ప్రతినిధి బృందం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను కలిసి బీజేపీ అధికార ప్రతినిధి, ఓ జాతీయ టీవీ ఛానెల్పై ఫిర్యాదు చేసింది.
శుక్రవారం ఒక న్యూస్ ఛానెల్లో జరిగిన చర్చలో ఇస్లాం, ప్రవక్త ముహమ్మద్(సఅ) పై కించపరిచే వ్యాఖ్యలతో నుపుర్ శర్మ ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో ప్రతినిధి బృందం పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. “ఆమె ప్రవక్త, ఇస్లాంకు వ్యతిరేకంగా మనోభావాలు గాయపడేలా తప్పుడు పదాలను ఉపయోగించారు. ముస్లింల మనోభావాలను గాయపరిచారు. ఖురాన్లో పేర్కొన్న మత విశ్వాసాలను అవమానించడం ద్వారా, ఆమె ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని కూడా సృష్టించిందని వారు పిర్యాదులో పేర్కొన్నారు.
“ముస్లిం ప్రతినిధి బృందంలో మౌలానా సయ్యద్ ఖుబూల్ పాషా షుత్తారి (సదర్ మజ్లిస్ ఉలేమై దక్కన్), మౌలానా హమీద్ మహమ్మద్ ఖాన్ (జమాత్-ఇ-ఇస్లామీ హింద్-టీఎస్), జియావుద్దీన్ నయ్యర్ (ఆల్-ఇండియా మజ్లిస్ తమీర్-ఎ-మిల్లత్ సదర్), మౌలానా ఔలియా షైకుల్ ఇస్లాం ఖాద్రీ చమన్), మౌలానా షఫీక్ ఆలం (అధ్యక్షుడు జమైత్-ఎ-అహ్లే హదీస్), మౌలానా మసూద్ హుస్సేన్ ముజ్తెహ్ది (అధ్యక్షుడు, అంజుమాన్-ఎ-మెహదవియా), మౌలానా హైదర్ అఘా (అధ్యక్షుడు, మజ్లిస్ ఉలేమా-ఓ-జకీరీన్) జాఫర్ పాషా (అమీర్-ఎ-మిల్లత్ అమర్లీ ఇస్లామియా) ఉన్నారు.