హైదరాబాద్: భావితరాలకు అప్పటి, ప్రస్తుత నాణేల ముద్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైఫాబాద్లోని మింట్ కాంపౌండ్లో ‘మింట్(కాయిన్) మ్యూజియం’ ప్రారంభమైంది. జూన్ 8 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సైఫాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ఏర్పాటుచేసిన ఈ మ్యూజియాన్ని మంగళవారం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)ఎండీ త్రిప్తి పత్రా గోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ మ్యూజియం ఏర్పాటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మింట్ మొదలైనప్పటి నాణేలతో పాటు అంతకుముందు ఉపయోగించినవి, వివిధ దేశాలకు చెందిన నాణేలను, కరెన్సీ కూడా ఇక్కడ పొందుపరిచామని చెప్పారు. మిషన్ ద్వారా నాణేలు తయారుచేసిన విధానాన్ని ఫొటోల రూపంలో భద్రపర్చామని, వరల్డ్ లార్జెస్ట్ అండ్ హెవీయెస్ట్ గోల్డ్ కాయిన్ “రెప్లికా” ని చూడొచ్చన్నారు. దీని బరువు 11కేజీల 935.8గ్రాములని, ఆగ్రాలో ని మింట్ లో 1613 ఏ.డీ కాలంలో దీన్ని తయారుచేశారని చెప్పారు.
అప్పటి మెఘలాయి నూర్ ఉద్దీన్ మహమ్మద్ జహంగీర్ చిత్రపు నాణేలు, 12రాశులతో అచ్చువేసిన నాణేలు చూడొచ్చన్నారు. 1803లో చార్మినార్ మొఘలపుర లో మింట్ ఏర్పాటైనప్పటి నుంచి నేటివరకు ఉన్న నాణేలను, నోట్లను సేఫ్గా ఉంచామని తెలిపారు. ఇందులో మొదటి రుపియా కాయిన్ (షేర్ షాహ్ సురి), హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అచ్చువేసిన అసఫ్ జాహీ కాయిన్స్, అచ్చు వేసే ముద్రణ పరికరాలు, ఒక పైసా, అర అనా, ఒక అనా, ఐదు పైసలు, పదిపైసలు ఇక్కడ విభిన్న ఆకారాల్లో పొందుపరిచారన్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సైఫాబాద్ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు. 1901 నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరుకోగా… దీన్ని పునరుద్ధరించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.