హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల వరదలా వస్తూనే ఉన్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్డ్ అమోలెడ్ డిస్ప్లేల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో బెంగళూరులో జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఎలెస్ట్ తరఫున రాజేశ్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ల తయారీ కంపెనీలకు అవసరమైన అమోలెడ్ డిస్ప్లేలను ‘ఎలెస్ట్’తయారు చేసి సరఫరా చేయనుంది.
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలేస్ట్ కంపెనీ.. ఈ పెట్టుబడితో తెలంగాణలో డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయనుంది. దేశంలో ఫ్యాబ్ రంగంలో భారీగా పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలేస్ట్ చరిత్రకెక్కనుంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, ట్యాబ్లకు అత్యాధునికమైన డిస్ప్లేల తయారీ ద్వారా ఐదు వేల మందికి ఉపాధి కల్పించనుంది.
రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్ప్లే ఫ్యాబ్తో ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని రాజేశ్ ఎక్స్పోర్ట్ ఛైర్మన్ రాజేశ్ మెహతా వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పని చేసే ప్లాంట్లో 3 వేల మంది శాస్త్రవేత్తలు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎలేస్ట్ కంపెనీ ఆరో తరం అమోల్డ్ డిస్ప్లే తయారీ ద్వారా భారత దేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు: మంత్రి కేటీఆర్
రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల పెట్టుబడి వచి్చన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పరిణామాన్ని తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజుగా అభివరి్ణంచారు. దేశ హైటెక్ తయారీ రంగానికి వచ్చిన భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రానున్న రూ. 24 వేల కోట్ల పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం భారత్ను ప్రపంచ హైటెక్ పరికరాలను తయారు చేస్తున్న దేశాల సరసన నిలుపుతుందన్నారు. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్లకు మాత్రమే సాధ్యమైనది ఇకపై తెలంగాణలో అవుతుందన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ (ఎల్రక్టానిక్స్) సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Historic day for Telangana😊
Rajesh Exports (Elest), a Fortune-500 company, to setup India's first Display FAB to manufacture the most advanced AMOLED displays, with an investment of ₹24,000 Cr, making it one of the largest investments in high-tech manufacturing sector in India pic.twitter.com/ygb9wK50j4
— KTR (@KTRTRS) June 12, 2022