హైదరాబాద్: జగిత్యాల మెడికల్ కాలేజీకి.. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లకు లెటర్ ఆఫ్ పర్మిషన్(‌‌ఎల్‌‌వోపీ) ఇస్తూ మంగళవారం‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే కాలేజీలో అడ్మిషన్లు‌‌ ప్రారంభించుకోవచ్చని చెప్పింది. కాలేజీలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవాలని సూచించింది. కాలేజీకి సంబంధించిన అన్ని పనులను, రిక్రూట్‌‌మెంట్లను ఇన్‌‌టైమ్‌‌లో పూర్తి చేస్తామని, నిధులు కేటాయిస్తామని రాష్ట్ర సర్కార్ నుంచి 2 వారాల్లో అండర్‌‌టేకింగ్ పత్రాలు తీసుకుని తమకు సమర్పించాలని‌‌ కాలేజీ ప్రిన్సిపాల్​కు రాసిన లేఖలో పేర్కొంది.

రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా తొలి దశలో 8 కాలేజీలకు ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ నిరుడు ఎన్‌‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ‌‌ఇందులో జగిత్యాల, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి, నాగర్‌‌కర్నూల్ కాలేజీలున్నాయి. ప్రస్తుతం జగిత్యాల కాలేజీకి పర్మిషన్ వచ్చిందని, మిగిలిన ఏడు కాలేజీలకూ పర్మిషన్ వస్తుందని డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తెలిపారు.

మారుమూల ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొదట 8 మెడికల్ కాలేజీలను నిర్మిస్తోంది. మెరుగైన వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంతవాసులు పట్టణాలకు, నగరాలను పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. అన్ని సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దుతోంది. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఈ ఏడాది జగిత్యాల మెడికల్ కాలేజీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సిద్ధమైంది. దీంతో ఎన్ఎంసీ ఈ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.