హైదరాబాద్: తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు భారీగా ఫీజులు వసూలు చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న తరుణంలో, తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల వినూత్న పంథాను అనుసరిస్తోంది. తమ పాఠశాలనలో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు రూ.5,000 బహుమతి అందజేస్తోంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గోధుమకుంట గ్రామంలోని ప్రజాప్రతినిధులు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు చొరవ తీసుకుని తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ప్రోత్సహించేందుకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
ఈ విషయం అందరికీ తెలిసేలా… ప్రజాప్రతినిధులు పాఠశాల ప్రవేశద్వారం వద్ద ఫ్లెక్సీని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఒక్క బహుమతి గురించే కాకుండా తమ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, విద్యార్థులకు అందించే సదుపాయాలను కూడా హైలైట్ చేసింది.
దాతల సహకారంతో 1 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు పాఠశాల యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించింది. పాఠశాలలో రెండు జతల యూనిఫారాలు, బూట్లు, సాక్స్లు, పుస్తకాలు, బ్యాగ్, బస్ పాస్లు అన్నీ ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా లభిస్తుంది. స్థానిక గ్రామపంచాయతీ పాఠశాల ఆవరణలో తగినంత పచ్చదనం ఉండేలా శ్రద్ధ చూపింది. అంతేకాదు పిల్లల్ని ఆకట్టుకునే విధంగా స్కూల్ భవనాన్ని అందంగా తీర్చిదిద్దింది.
ఈ పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం రెండింటిలోనూ విద్యను అందించే ఏర్పాట్లు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.