హైదరాబాద్: ఇమామ్లు, ముఅజ్జిన్ల నెలవారీ గౌరవ వేతనం విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో నమ్మబలుకుతోంది. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది ఇమామ్లు, ముఅజ్జిన్లు గౌరవ వేతనం అందుకునేందుకు ఎదురుచూస్తున్నారు.
ఇమామ్లు (సామూహిక నమాజ్కు నాయకత్వం వహించే వారు), ముఅజ్జిన్లు (నమాజ్ ఏర్పాట్లు చేసేవారు) గౌరవ వేతనం విడుదల చేయడంలో ప్రభుత్వం నిరంతరం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నెలకు రూ. 5,000 స్వల్ప మొత్తాన్ని చెల్లించేందుకు కూడా మీనమేషాలు లెక్కపెడుతోంది. ఈ చిన్న మొత్తం ఖజానాపై భారం కానప్పటికీ, అది అంతంత మాత్రం అయిన గౌరవ వేతనం అందుకునేందుకు ఇమామ్లు, ముఅజ్జిన్లు దానిని స్వీకరించడానికి 4-6 నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి.
ఈ దుస్థితిపై సామాజిక కార్యకర్త ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ మాట్లాడుతూ… ఇమామ్, ముఅజ్జిన్ల జీతాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలకు బాగా తెలుసు. ఇమామ్లు, ముఅజ్జిన్లు ఆర్థిక కష్టాలు పడాల్సిందేనా… వారి ఆర్థిక దుస్థితిని ప్రభుత్వ సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
ఇమామ్లు ముఅజ్జిన్లకు గత ఐదు నెలలుగా వారి గౌరవ వేతనం అందటంలేదు. చివరిగా ఫిబ్రవరిలో “అక్టోబర్, నవంబర్, డిసెంబర్” గౌరవవేతనం అందుకున్నారు. ఇక జనవరి నుండి ఇప్పటి వరకు వారికి డబ్బులు అందలేదు. ప్రభుత్వం గౌరవ వేతనాన్ని త్వరగా విడుదల చేయాలి. వీరిలో ఎక్కువ మంది గౌరవ వేతనంపై ఆధారపడి ఉన్నారని సామాజిక కార్యకర్త ఆసిఫ్ హుస్సేన్ అన్నారు.