కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితి భయంకరంగా ఉంది. నది నీటి మట్టం 60 అడుగుల స్థాయిని దాటింది. గోదావరి నదిలో గురువారం వరద ఉధృతి… ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. నదిలో నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వరద 60 అడుగుల మట్టం దాటింది. సాయంత్రం 6 గంటలకు 19.29 లక్షల క్యూసెక్కుల విడుదలతో నీటిమట్టం 62.20 అడుగులకు చేరింది. 1976 నుండి నది 60 అడుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదోసారి.
నదిలో వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భద్రాచలం వద్ద ఉన్న గోదావరి వంతెనను ప్రజల భద్రత రీత్యా మూసివేశారు. ఫలితంగా భద్రాచలం పట్టణం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి. వరదల కారణంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీతో కలిపే రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
వరదల కారణంగా 36 సంవత్సరాల తర్వాత వంతెన మూసివేశారు. చివరిసారిగా 1986లో వంతెన మూసేసారు. నదిలో రికార్డు స్థాయిలో 75.6 అడుగుల వరద నమోదైంది. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా 144 సెక్షన్ విధించారు. ప్రజల రాకపోకలను నిలిపివేస్తున్నామని, వంతెనపై… వచ్చే 48 గంటల పాటు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
బూర్గంపాడు మండలం సారపాక బీపీఎల్ స్కూల్, కేజీబీవీ నాగినేనిప్రోలులో ఏర్పాటు చేసిన గోదావరి కరకట్ట, వరద పునరావాస కేంద్రాలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సందర్శించి నిర్వాసితులతో ముచ్చటించారు.
బూర్గంపాడు గ్రామం వద్ద వరద నీరు క్రమంగా గ్రామంలోకి చేరుతున్నందున ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని మంత్రి కోరారు. పునరావాస కేంద్రాల్లో మంచి ఆహారం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.