హైదరాబాద్: బస్సుల రాకపోకల సమయాన్ని ప్రయాణికులు సులువుగా గుర్తించడం కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) సరికొత్తగా ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం ప్రయాణీకుల అరచేతిలోకి వచ్చేసింది.
మొబైల్ ఫోన్లలో ‘టీఎస్ఆర్టీసీ బస్ట్రాకింగ్’ యాప్ ద్వారా బస్సుల కచ్చితమైన జాడను తెలియజేసే ట్రాకింగ్ సేవలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్టణం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే రైళ్లలో ఈ సదుపాయం ఉంది. రైల్ యాత్రి అనే యాప్ ద్వారా రైలు బయలు దేరిన, వచ్చిన స్టేషన్ వివరాలను లైవ్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా 96 డిపోల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 4170 బస్సులను ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు ఎదురు చూసే బస్టాపునకు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలిసిపోతుంది. ప్రయాణికులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘టీఎస్ఆర్టీసీ బస్ట్రాకింగ్’ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పైలట్ ప్రాజెక్ట్ కోసం 140 బస్సులను గుర్తించామని, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్కు వెళ్లే 40 ఏసీ పుష్పక్ బస్సులను, 100 సుదూర ప్రాంతాల్లో బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగుళూరు, విశాఖపట్నం వంటి రూట్లలో నడుస్తున్న మియాపూర్-1, పికెట్ డిపోలకు చెందుని బస్సులను ప్రస్తుతం ట్రాక్ చేయనున్నారు.
మరో రెండు నెలల్లో జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలో అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్లో చేర్చనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు మహిళా హెల్ప్లైన్ వంటి ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్లో అందుబాటులోకి తేనున్నారు. అంతేకాదు కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపైన కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.